CBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం సీబీఎస్ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి. అయితే, ఈ విషయంలో తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. 7-9 తరగతి విద్యార్థులు పదో తరగతి వరకు తమకు నచ్చిన విదేశీ భాషను చదువుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే అభ్యసిస్తున్న విదేశీ భాషలను రెండు సబ్జెక్టులుగా కొనసాగించవచ్చు. గతంలో అమలైన విధానం ప్రకారం విద్యార్థులు రెండు విదేశీ భాషలను ఎంచుకునే సౌకర్యం ఉండేది.
భారతీయ భాష తప్పనిసరి కాదు. దీంతో కొందరు విద్యార్థులు రెండూ విదేశీ భాషల్నే ఎంచుకున్నారు. ఇంకొందరు ఒక విదేశీ భాష, ఒక భారతీయ భాష చదువుకునే వారు. కానీ, సీబీఎస్ఈ బోర్డు కొత్తగా తెచ్చిన త్రిభాషా విధానం ప్రకారం ఏదైనా ఒక్క విదేశీ భాషను మాత్రమే ఎంచుకోవచ్చు. ఈ ఏడాది నుంచి త్రిభాషా విధానం అమలవుతోంది. దీన్ని ప్రస్తుతం తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి అమలు చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. అంటే, గత ఏడాది ఎనిమిదో తరగతి వరకు రెండు విదేశీ భాషలు చదువుకున్న వారు ఇప్పుడు తొమ్మిదో తరగతికి రాగానే ఒక విదేశీ భాషను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రెండు భారతీయ భాషలు చదవాలి. ఈ నిర్ణయం ప్రకారం గతంలో వారు చదివిన రెండు విదేశీ భాషల్లో ఒకటి వృథా అవుతుంది. ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇంతకాలం తాము చదివిన రెండు భాషలకు అర్థం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విమర్శించారు.
మళ్లీ కొత్త భాష నేర్చుకోవడం ఇబ్బంది అని చెప్పారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 7-9 వరకు చదువుతున్న విద్యార్థుల్లో రెండు విదేశీ భాషలు చదువుకున్న వారు ఉంటే.. వారు పదో తరగతి వచ్చే వరకు కూడా ఇదే పద్ధతిలో రెండు విదేశీ భాషల్ని చదువుకోవచ్చు. ఒక భారతీయ భాషను ఎంచుకోవచ్చు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక త్రిభాషా విధానంలో కేంద్రం వెనుకడుగు వేసిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సీబీఎస్ఈ అధికారులు మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సీబీఎస్ఈ బోర్డు తాజా నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులకు మేలు జరగనుంది.