లక్నో : అఖిల భారత అఖాడా పరిషత్ చీఫ్ మహంత్ నరేంద్ర గిరి మృతి కేసు విచారణను సీబీఐ చేపట్టింది. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ ఈ కేసు దర్యాప్తు చేపట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ విజ్ఞప్తి చేసిన కొద్దిరోజులకే సీబీఐ రంగంలోకి దిగింది. రాష్ట్ర పోలీసుల నుంచి కేసు విచారణను బదలాయించే ప్రక్రియను పూర్తిచేసేందుకు సీబీఐ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బృందం ప్రయాగరాజ్కు చేరుకుంది.
స్వామీజీ మరణానికి దారితీసిన పరిస్ధితులను వెలికితీసేందుకు యూపీ ప్రభుత్వం అంతకుముందు 18 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. మహంత్ గిరి ప్రయాగ్రాజ్లోని బాగంభరి మఠంలో ఏడు పేజీల సూసైడ్ నోట్ను రాసి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్వామీజీ ఫోన్ను సిట్ స్వాధీనం చేసుకున్న క్రమంలో హరిద్వార్లోని ప్రాపర్టీ డీలర్లతో ఆయన పలుమార్లు మాట్లాడినట్టు వెల్లడైంది.
ప్రాపర్టీ డీలర్లు సహా 18 మందిని విచారణలో భాగంగా హాజరుకావాలని సిట్ సమన్లు జారీ చేసింది. మహంత్ ఆత్మహత్య చేసుకున్న అనంతరం తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉరి వేసుకునేందుకు స్వామీజీ వాడిన పసుపు రంగు నైలాన్ తాడు మూడు భాగాలుగా కత్తిరించిఉన్నట్టు వీడియోలో కనిపించింది.