న్యూఢిల్లీ, అక్టోబర్ 16: లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీచేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. సమన్లపై సిసోడియా స్పందించారు. తాను కేంద్ర దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఇంతకుముందు తన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో సీబీఐకి ఏమీ దొరకలేదని, అందుకే మళ్లీ ఇలాంటి చర్యలకు దిగుతున్నదని విమర్శించారు.
‘సీబీఐ నా ఇంటిపై దాడిచేసింది. 14 గంటలపాటు సోదాలు నిర్వహించింది. ఏమీ దొరకలేదు. నా బ్యాంక్ లాకర్ను వెతికింది. అక్కడా ఏమీ దొరకలేదు. నా ఊరిలోనూ ఏమీ కనుగొనలేకపోయారు. ఇప్పుడు సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలుస్తున్నారు. నేను తప్పక హాజరై.. వారికి పూర్తిగా సహకరిస్తా. సత్యమేవ జయతే’ అని సిసోడియా ట్వీట్ చేశారు. కాగా, మనీశ్ సిసోడియా, జైళ్లో ఉన్న మంత్రి సత్యేంద్ర జైన్ నేటి భగత్సింగ్లని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు.