Actor Vijay | కరూర్ తొక్కిసలాట (Karur stampede) కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Actor Vijay)కి సీబీఐ (CBI) మూడు రోజుల క్రితం సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సీబీఐ అధికారులు సీజ్ చేశారు. కరూర్ సభ జరిగిన రోజు వాహనం ప్రయాణ వివరాలు, అనుమతులు వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. బస్సు డ్రైవర్ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు.
కాగా గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ పట్టణంలో విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 110 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక మూడు రోజుల క్రితం విజయ్కి సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 12న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులలో ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్లో విజయ్ని విచారించనున్నట్లు తెలిపింది.
అదేవిధంగా సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ఈ కమిటీని వేసింది. ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా చూడాలని టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు, ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.
Also Read..
Delhi | చలి తీవ్రతకు వణుకుతున్న ఢిల్లీ.. పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం
Dal Lake | గడ్డకట్టిన దాల్ సరస్సు.. VIDEO
ISRO | పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగానికి సిద్ధం.. తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్