న్యూఢిల్లీ, మే 27: సీబీఐ అధికారులు సోదాల పేరుతో తన ‘అత్యంత రహస్యమైన’ వ్యక్తిగత పత్రాలను కూడాస్వాధీనం చేసుకొన్నారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన పేపర్లను సీజ్ చేసినట్టు తెలిపారు. ఇది తన పార్లమెంటరీ హక్కులకు భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ‘రాజ్యాంగ, చట్ట విరుద్ధమైన చర్యల వల్ల నేను బాధితుడినయ్యాను. అందుకే మీకు ఈ లేఖ రాస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు.
కొన్నేండ్లుగా తనను, తన కుటుంబాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకొన్నాయని ఆరోపించారు. తమ గళాన్ని అణచివేసేందుకు వరుసగా తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నాయని మండిపడ్డారు. ‘11 ఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తీసుకొన్న ఓ నిర్ణయంలో నా ప్రమేయం లేకపోయినా సీబీఐ నాపై కేసు నమోదు చేసింది. ఐటీ పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసిన సాక్షులను విచారించేందుకు నేను తయారు చేసుకొన్న ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకొన్నది. ఎంపీగా నా విధుల్లో సీబీఐ జోక్యం చేసుకొన్నది’ అని కార్తి లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కార్తి వరుసగా రెండో రోజు శుక్రవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు.