న్యూఢిల్లీ, మార్చి 16: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరస్టై జైలులో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. 2016లో ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వ ఫీడ్బ్యాక్ యూనిట్లో అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడ్డారని, రాజకీయ అవసరాల కోసం వ్యక్తిగత గోప్యమైన వివరాలను సేకరించారని సీబీఐ ఆరోపించింది. అవినీతి నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈ యూనిట్ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ అవసరాలు, నిఘా కోసం వినియోగించుకున్నారని సీబీఐ పేర్కొంది.
సిసోడియాతో పాటు ఢిల్లీ ప్రభుత్వంలో విజిలెన్స్ కార్యదర్శిగా పని చేసిన 1992 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి సుఖేష్ కుమార్ జైన్, ఫీడ్బ్యాక్ యూనిక్కు జాయింట్ సెక్రటరీగా, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రత్యేక సలహాదారుగా పని చేసిన రిటైర్డ్ సీఐఎస్ఎఫ్ డీఐజీ రాకేశ్ కుమార్ సిన్హాపై కూడా కేసు నమోదు చేసింది. వీరితో పాటు ఫీడ్బ్యాక్ యూనిట్కు డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న ప్రదీప్ కుమార్ పంజ్, ఫీడ్బ్యాక్ ఆఫీసర్ సతీశ్ ఖేత్రపాల్, కేజ్రీవాల్కు అవినీతి నిరోధక సలహాదారు గోపాల్ మోహన్ల పేర్లను కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చింది.
మనీశ్ సిసోడియాపై అనేక తప్పుడు కేసులు బనాయించి ఎక్కువ కాలం ఆయనను జైలులో ఉంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కుట్ర చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.