న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ మాయారామ్పై సీబీఐ గురి పెట్టింది. మాయారామ్ ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు నోట్ల ముద్రణలో అవినీతి జరిగిందని పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. నోట్ల ముద్రణలో ఉపయోగించే సెక్యూరిటీ స్ట్రిప్ సరఫరాలో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని అవినీతికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే సెక్యూరిటీ స్ట్రిప్ లను సరఫరా చేసే సంస్థ కాంట్రాక్టును మాయారామ్ పొడిగించారని తెలిపింది.
ఈ అవినీతిలో మయారామ్తోపాటు ఆర్థికశాఖ, ఆర్బీఐకి చెందిన కొందరు అధికారులు, బ్రిటన్కు చెందిన ఓ సంస్థ ప్రమేయమున్నదని వెల్లడించింది. దీనిపై తమకు 2018లోనే ప్రాథమికంగా సమాచారం అందడంతో అంతర్గతంగా దర్యాప్తు జరిపామని తెలిపింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి రావడంతో ఇప్పుడు కేసు నమోదు చేశామని సీబీఐ వివరించింది. ఇందులో భాగంగానే గురువారం మాయారామ్కు చెందిన ఢిల్లీ, జైపూర్లోని ఇండ్లలో సోదాలు జరిపామని వెల్లడించింది.