న్యూఢిల్లీ/భువనేశ్వర్, జూన్ 6: ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఫొరెన్సిక్ నిపుణులతో కలిసి బాలాసోర్కు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మంగళవారం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఆండ్ ట్రైనింగ్(డీవోపీటీ) ఉత్తర్వులు ఇవ్వడంతో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. రైళ్ల ప్రమాదంలో మొత్తం 1100 మందికి పైగా గాయపడి దవాఖానల్లో చేరగా ఇంకా 101 మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోయినట్టు రైల్వే అధికారి తెలిపారు. ఇప్పటివరకు 288 మంది మరణించారని చెప్పారు.
నీటిని చూసి రక్తమని భ్రమ
రెస్క్యూ చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో కొందరు మానసిక సమస్యలకు గురవుతున్నారు. నీటిని చూసినప్పుడల్లా రక్తాన్ని చూసినట్టు భ్రమపడుతున్నారని ఎన్డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ తెలిపారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ నుంచి వెలికితీసిన వాటిలో 40 మృతదేహాలకు ఎలాంటి గాయాలు కనిపించలేదు. వీరు విద్యుదాఘాతం వల్ల మరణించినట్టు గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు రైల్వే లో టెన్షన్(ఎల్టీ) విద్యుత్ తీగలు తెగి కొన్ని కోచ్లలో విద్యుదాఘాతానికి కారణమయ్యాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
కొడుకును కాపాడుకున్న తండ్రి
రైలు ప్రమాదంలో చనిపోయాడనుకున్న కుమారుడిని మార్చురీ నుంచి తీసుకెళ్లి కాపాడుకున్నాడో తండ్రి. పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన హేలారామ్ మల్లిక్ కుమారుడు బిశ్వజీత్(24) కోసం తాత్కాలిక మార్చురీకి వెళ్లాడు. తన కొడుకు కొన ఊపిరితో ఉన్నాడని దవాఖానకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం బిశ్వజీత్ దవాఖానలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు.
మార్చురీలో మృతదేహాలుగా ఐదు రోజులు
భువనేశ్వర్ : ఒడిశా రైలు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృత్యుంజయుల్లా ప్రాణాలు కాపాడుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని చర్నేఖలి గ్రామానికి చెందిన వలస కూలీ రాబిన్ నైయా(35) తీవ్రంగా గాయపడి పట్టాలపై పడి ఉండగా, అతడ్ని రెస్క్యూ సిబ్బంది తాత్కాలిక మార్చురీకి తరలించారు. మార్చురీలో మృతదేహాలను తరలిస్తున్న ఓ వ్యక్తి కాలిని పట్టుకున్నాడు. దీంతో అతడు ప్రాణంతో ఉన్నాడని గుర్తించి వెంటనే దవాఖానకు తరలించి చికిత్స చేస్తున్నారు. అతడు రెండు కాళ్లు కోల్పోయినప్పటికీ ప్రాణాలు దక్కించుకున్నాడు.