Satyapal Malik | న్యూఢిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీకే చెందిన జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్మాలిక్కు సీబీఐ నోటీసులు జారీచేసింది. ఇటీవల ‘ది వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ మోదీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. దేశ భద్రత విషయంలో మోదీ అనుసరించిన నిర్లక్ష్య వైఖరి, పుల్వామా ఘటనపై ప్రధాని మోదీ, రక్షణ సలహాదారు అజిత్ దోవల్ తీరును విమర్శించారు. సైనికులను రోడ్డు మార్గాన తరలించడం అంత క్షేమం కాదని, వారిని విమానాలలో పంపాలని చేసిన విజ్ఞప్తిని హోం శాఖ తిరస్కరించడం, టెర్రరిస్టు ముఠాలు చేసిన దాడిలో 40 మంది సైనికులు మరణించడాన్ని అయన వివరించారు. ఈ దుర్ఘటనను మోదీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని సత్యపాల్మాలిక్ వివరించారు. అదే ఇంటర్వ్యూలో రిలయన్స్ ప్రాజెక్టు అనుమతి కోసం తనకు రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆరోపణలకు చేశారు. దీనికి సంబంధించి ప్రశ్నించడానికే సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసి ఈ నెల 28న హాజరుకావాలని ఆదేశించినట్టు భావిస్తున్నారు.
ఏమిటీ రిలయన్స్ వివాదం?
సత్యపాల్మాలిక్ జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆరెస్సెస్ నేత రామ్మాధవ్ ఆయనను కలిసి రద్దు చేసిన రిలయన్స్ కంపెనీ ఆరోగ్యబీమా పథకానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దానికి మాలిక్ తిరస్కరించారు. అయితే ఆ పథకానికి అనుమతి ఇస్తే రూ.300 కోట్ల లంచం ఇస్తానని తనకు ఆఫర్ చేశారని మాలిక్ ఇటీవల ‘ది వైర్’ ఇంటర్వ్యూలో ఆరోపించారు. దీనిపై రామ్మాధవ్ మండిపడ్డారు. రిలయన్స్ ఇన్సూరెన్స్ పథకం గురించి తాను మాలిక్ను అడగలేదని, అసత్య ఆరోపణలతో తనకు నష్టం కలిగించిన ఆయనపై పరువు నష్టం దావా వేయనున్నట్టు హెచ్చరించారు. కాగా, తాను సత్యం వైపే ఉంటానని సత్యపాల్ మాలిక్ వెల్లడించారు.