ఇంఫాల్, అక్టోబర్ 1: మణిపూర్లో ఈ ఏడాది జూలైలో చోటుచేసుకొన్న ఇద్దరు విద్యార్థుల హత్య కేసులో సీబీఐ నలుగురిని అరెస్టు చేసింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నది. అరెస్టు అయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. నిందితుల్లో ఒకరు హత్యకు గురైన విద్యార్థిని స్నేహితురాలని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నలుగురు నిందితులను సీబీఐ అధికారులు విమానంలో అస్సాంలోని గువాహటికి తరలించారు.
అంతకుముందు మణిపూర్ పోలీసులు, భారత ఆర్మీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో చురాచంద్పూర్ జిల్లాలో హత్య కేసు అనుమానిత నిందితులను పట్టుకొన్నారు. అనంతరం వారిని ఇంఫాల్ ఎయిర్పోర్టుకు తీసుకెళ్లి, అక్కడ సీబీఐకి అప్పగించారు. అక్కడి నుంచి నిందితులను అస్సాంకు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొన్నారన్న సమాచారం నేపథ్యంలో కొంత మంది ప్రజలు ఎయిర్పోర్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో నిందితులను తీసుకెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయ్యే వరకు కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నదని భద్రతా వర్గాలు తెలిపాయి.