న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పొలిటికల్ ఇంటెలిజెన్స్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను విచారించేందుకు సీబీఐకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం 2015లోనెలకొల్పిన ఫీడ్బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ) ద్వారా విపక్ష రాజకీయ పార్టీల సమాచారం అక్రమంగా సేకరించారనేది సిసోడియాపై తాజా ఆరోపణ. ఆయనపై ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ విచారణ జరుపుతున్నది. అంతలోనే మరో కేసులో విచారణకు కేంద్రం అనుమతివ్వటం గమనార్హం. అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 17 ప్రకారం సిసోడియాను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇస్తున్నట్టు బుధవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
ఏమిటీ కేసు: ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని నిర్మూలించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం 2015లో ఎఫ్బీయూను ఏర్పాటు చేసింది. ఈ విభాగం అన్ని శాఖల నుంచి సమాచారాన్ని సేకరించి సీఎంకు, డిఫ్యూటీ సీఎంకు అందజేస్తుంది. దీని ఆధారంగా అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. అయితే అవినీతి నిర్మూలన ముసుగులో ఆప్ ప్రభుత్వం ఎఫ్బీయూ ద్వారా రాజకీయ పార్టీలపై నిఘా పెట్టి సమాచారం సేకరించిందని సీబీఐ ఆరోపిస్తున్నది.