JEE-Mains | దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ సంస్థల్లో అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ-మెయిన్లో అవకతవకలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), ఇండోర్, పుణె, బెంగళూరు, జంషెడ్పూర్లలో సీబీఐ గురువారం సోదాలు జరిపింది.
ఎఫినిటి ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతోపాటు దాని డైరెక్టర్లు సిద్ధార్థ్ కృష్ణ, విశ్వంభర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్ష్నేయ్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ సంస్థ, అందులో పని చేస్తున్న సిబ్బంది జేఈఈ-మెయిన్లో పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఎన్ఐటీలో అడ్మిషన్ పొందాలని కోరుకుంటున్న విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ముడుపులను ఎఫినిటీ ఎడ్యుకేషన్ సంస్థ ఉద్యోగులు అందుకున్నట్లు అభియోగం. హర్యానాలోని సోనేపట్ వద్ద పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థి.. రిమోట్ యాక్సెస్ ద్వారా జవాబులు తెలిసేలా చేశారని తెలుస్తున్నది.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల విద్యార్థుల నుంచి 10వ, 12వ తరగతి మార్కుల జాబితాలు, యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు తీసుకున్నారు. పోస్ట్ డేటెడ్ చెక్లు తీసుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.12-15 లక్షలు వసూలు చేశారని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్సీ జోషి చెప్పారు.
ఢిల్లీ- దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), పుణె, జంషెడ్పూర్, ఇండోర్, బెంగళూర్ల్లోని 19 చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. 25 లాప్టాప్లు, 7 పర్సనల్ కంప్యూటర్లు, 30 పోస్ట్ డేటెడ్ చెక్లు, వివిధ విద్యార్థుల పీడీసీ మార్క్షీట్స్, నేరాభియోగ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.