న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణం వెలుగు చూసింది. రూ.34,615 కోట్ల మోసానికి పాల్పడగా.. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL), కంపెనీ మాజీ సీఎండీ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఇదే సీబీఐ దర్యాప్తు చేస్తున్న అతిపెద్ద కేసని అధికారులు తెలిపారు. గతేడాది డీహెచ్ఎఫ్ఎల్ను పిరమాల్ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కుంభకోణంపై ఈ నెల 20న కేసు నమోదు చేయగా.. సీబీఐకి చెందిన 50 మందికిపైగా అధికారుల బృందం బుధవారం ముంబైలోని 12 ప్రాంగణాల్లో ఎఫ్ఐఆర్ లిస్టెడ్ నిందితులకు చెందిన 12 చోట్ల సోదాలు నిర్వహించింది.
ఇందులో అమరిల్లిస్ రియల్టర్స్కు చెందిన సుధాకర్ శెట్టి, ఎనిమిది మంది ఇతర బిల్డర్లు ఉన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడిన 17 బ్యాంకుల కన్సార్టియాన్ని రూ.34,615 కోట్ల మేర మోసం చేసేందుకు కుట్ర పన్నారనే అభియోగాలు వారిపై ఉన్నాయి. ఆయా బ్యాంకుల కన్సార్టియం నుంచి 2010 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు రూ.42,871 కోట్ల రుణాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
లెక్కలను డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా పుస్తకాల్లో తప్పుగా చూపించి.. వాస్తవాలను దాచిపెట్టి కపిల్, ధీరజ్ వాధావన్ ఇతరులతో కుట్రపూరితంగా తిరిగి చెల్లించలేమంటూ చేతులు ఎత్తేశారని సీబీఐ పేర్కొంది. 2019 మే నెల నుంచి రుణాలను తిరిగి చెల్లించడాన్ని డీహెచ్ఎఫ్ఎల్ నిలిపివేసిందని, ఫలితంగా బ్యాంకులు ఆయా లోన్లను మొండి బకాయిలుగా ప్రకటించాయని పేర్కొంది. ఆ కంపెనీ డైరెక్టర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ కుట్రపూరిత చర్యలతో బ్యాంకులకు దాదాపు రూ.34,615 కోట్లు నష్టం జరిగిందని వివరించింది. వీరిద్దరూ గతంలో మోసం చేసిన కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
డీహెచ్ఎల్ఎఫ్ రుణ ఖాతాలను రుణదాత బ్యాంకులు వేర్వేరు సమయాల్లో నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయని అధికారులు తెలిపారు. నిధుల కుంభకోణంలో కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్లతో పాటు స్కైలార్క్ బిల్డ్ కాన్ కంపెనీ, దర్శన్ డెవలపర్స్, సిగ్తియా కన్ స్ట్రక్షన్స్ బిల్డర్స్, టౌన్ షిప్ డెవలపర్స్, శిషిర్ రియల్టీ, సన్ బ్లింక్ రియల్ ఎస్టేట్, సుధాకర్ శెట్టి తదితరులను నిందితులుగా చేర్చింది. వీరందరిపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లోని పలు సెక్షన్లతో పాటు చీటింగ్ అభియోగాలతో కేసులు నమోదు చేశారు.