పాట్నా: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ బెయిల్ను రద్దు చేయాలని ఢిల్లీ ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. ఐఆర్సీటీసీ స్కామ్పై దర్యాప్తు చేస్తున్న ఆ సంస్థ ఈ మేరకు తదుపరి చర్యలకు సిద్ధమైంది. దీంతో సీబీఐ పిటిషన్పై సమాధానం ఇవ్వాలని తేజస్వి యాదవ్కు ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్ నోటీసులు జారీ చేశారు.
2006లో జార్ఖండ్లోని రాంచీ, ఒడిశాలోని పూరిలో ఉన్న ఐఆర్సీటీసీ హోటల్స్ను ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వడంలో భారీగా అవినీతి జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. బీహార్ రాజధాని పాట్నాలోని కీలక ప్రాంతంలో మూడు ఎకరాల వాణిజ్య ప్లాట్ లంచంగా ఇచ్చినట్లు పేర్కొంది. ఐఆర్సీటీసీ హోటల్స్ కాంట్రాక్ట్ కేటాయింపులో అవకతవకలకు సంబంధించి 12 మంది వ్యక్తులు, రెండు సంస్థలపై కేసు నమోదు చేసింది.
ఈ స్కామ్కు సంబంధించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆయన తల్లి, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి 2018లో బెయిల్ పొందారు. అయితే తేజస్వి బెయిల్ రద్దు చేయాలని ఢిల్లీ ప్రత్యేక కోర్టును సీబీఐ శనివారం కోరింది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా వారిపై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది.