ముంబై : ముడుపుల కేసులో మహారాష్ట్రలోని నాగపూర్లో సెంట్రల్ రైల్వే ఇంజనీర్ను సీబీఐ అరెస్ట్ చేసింది. నాగపూర్లో సెంట్రల్ రైల్వేస్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (దక్షిణ) ఏబీ చతుర్వేదిని ఫిర్యాదుదారు నుంచి రూ 1.80 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా శుక్రవారం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇంజనీర్ నివాసంలో సీబీఐ రూ 60.62 లక్షల నగదు, ఇతర పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పిర్యాదుదారు సంస్ధకు చెందిన బిల్లులను క్లియర్ చేసేందుకు ఇంజనీర్ రూ 1.80 లక్షల లంచం డిమాండ్ చేశాడని సీబీఐకి ఫిర్యాదు అందింది.
ఫిర్యాదుదారు కంపెనీకి రూ 89.55 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉండగా అందులో రెండు శాతం డబ్బును ముడపుల కింద చెల్లించాలని నిందితుడు డిమాండ్ చేశాడని సీబీఐ ప్రతినిధి తెలిపారు. సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు ఇంజనీర్ను లంచం డబ్బు స్వీకరిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.