జైపూర్, ఆగస్టు 20: చట్టాలు, కోర్టులంటే లెక్కలేని బీజేపీ నేతల బరితెగింపు ధోరణికి నిదర్శనమిది. గోవధకు పాల్పడితే ఎవరినైనా చంపేయాలంటూ రాజస్థాన్ బీజేపీ నేత జ్ఞాన్దేవ్ అహుజా బహిరంగంగా పిలుపునిచ్చారు. అంతేగాకుండా, తాము ఇప్పటివరకు ఐదుగురిని చంపేశామంటూ గొప్పగా చెప్పుకున్నారు! లాలావండి, బెహ్రార్ మూకహత్యలను (రక్బర్ ఖాన్, పెహ్లూ ఖాన్ హత్యలు) ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ రెండు హత్యలూ.. ఒకటి 2017లో, మరొకటి 2018లో రామ్గఢ్లో చోటుచేసుకున్నాయి. హత్యలు జరిగిన సమయంలో ఈ నియోజకవర్గానికి అహుజానే ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన పేర్కొన్న మిగతా మూడు హత్యలూ ఏమిటన్నవి వెంటనే తెలియరాలేదు. అహుజా మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
చంపేందుకు కార్యకర్తలకు స్వేచ్ఛ
‘చంపేందుకు కార్యకర్తలకు నేను స్వేచ్ఛ ఇచ్చా. మేం వారిని బెయిల్ బయటకు తీసుకొస్తాం’ అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. వీడియో వైరల్ కావడంతో అహుజాపై ఐపీసీ సెక్షన్ 153ఏ కింద కేసు నమోదైంది. అహుజా గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ హంతకులు దేశభక్తులని, ఛత్రపతి శివాజీ, గురుగోవింద్సింగ్ అసలైన వారసులని పేర్కొన్నారు. పెహ్లూఖాన్ మూకహత్య కేసులో ఆరుగురు నిందితులూ 2019లో నిర్దోషులుగా బయటకు వచ్చారు. అయితే ఈ తీర్పుపై అప్పీల్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నది. రక్బర్ ఖాన్ మూకహత్య కేసు విచారణ ఇప్పటికీ స్థానిక కోర్టులో కొనసాగుతున్నది.
ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
అహుజా వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నది. అయితే అహుజా మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గోవధకు పాల్పడేవారెవరైనా వదిలేది లేదని స్పష్టంచేశారు. అహుజా మాట్లాడుతున్న వీడియాను కాంగ్రెస్ నేత గోవింద్ సింగ్ దోత్సారా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘బీజేపీ మతోన్మాదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? బీజేపీ అసలు స్వరూపం బయటపడింది’ అని వ్యాఖ్యానించారు.