చండీగఢ్: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే ఇకపై చట్టపరంగా చర్యలు ఎదుర్కొవడంతోపాటు రక్త దానం కూడా చేయాలి. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పంజాబ్ పోలీసులు కొత్త ట్రాఫిక్ నిబంధనలను ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం వాహనం వేగ పరిమితి మించినా, మద్యం సేవించి లేదా డ్రగ్స్ మత్తులో డ్రైవింగ్ చేసినా జరిమానా, తాత్కాలికంగా లైసెన్స్ సస్పెన్షన్ వంటి చర్యలతో పాటు శిక్షలో భాగంగా సామాజిక సేవ కూడా చేయాలి. ఇందులో భాగంగా ఆసుపత్రిలో సేవ చేయడం లేదా రక్త దానం తప్పనిసరి.
మరోవైపు తొలిసారి పట్టుబడిన తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు రెట్ల జరిమానా విధిస్తారు. తొలిసారి వేగ పరిమితిని మించిన నేరానికి రూ.1,000 జరిమానా, మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు, మూడు నెలల డ్రెవింగ్ లైసెన్స్ సస్పెన్షన్తో పాటు రూ.5,000 జరిమానా విధిస్తారు. తదుపరి నేరాలకు, అతివేగానికి రూ.2,000, మద్యం సేవించి వాహనం నడిపితే డ్రెవింగ్ లైసెన్స్ సస్పెన్షన్తో పాటు రూ.10,000 జరిమానా విధిస్తారు.
పంజాబ్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, సంబంధిత నేరాలకు పాల్పడిన వారు ట్రాన్స్పోర్ట్ అథారిటీ ద్వారా రిఫ్రెషర్ కోర్సును కూడా చేయాలి. అలాగే ప్రతి నేరానికి సమీపంలోని పాఠశాలలో 9 నుంచి 12వ తరగతి వరకు కనీసం 20 మంది విద్యార్థులకు మినిమంగా 20 గంటల పాటు బోధించాలి. దీనికి అదనంగా అపరాధులు సమీపంలోని ఆసుపత్రిలో కనీసం రెండు గంటలపాటు సమాజ సేవ చేయాలి. లేదా సమీపంలోని బ్లడ్ బ్యాంక్లో కనీసం ఒక యూనిట్ రక్తం దానం చేయాలి.