అహ్మదాబాద్, సెప్టెంబర్ 21: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మాల్ధారీల దెబ్బకు బీజేపీ ప్రభుత్వం ఠారెత్తిపోతున్నది. రెండు దశాబ్దాలకుపైగా గుజరాత్ను ఉక్కు పిడికిలితో పాలిస్తున్న బీజేపీకి పశువుల కాపరులు పట్టపగలే చుక్కలు చూపించారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద జంతు నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 60 లక్షల మాల్ధారీలు రాష్ర్టాన్ని స్తంభింపజేశారు. దీంతో బెంబేలెత్తిపోయిన సర్కారు అత్యవసరంగా బుధవారం అసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చ లేకుండానే బిల్లును వెనక్కి తీసుకొంటున్నట్టు ప్రకటించింది.
ఎవరీ మాల్ధ్దారీలు?
మాల్ధారీ అనేది గుజరాతీ పదం. మాల్ అంటే పశువులు.. ధారీ అంటే కలిగి ఉండటం. పశువులు పెంచుకొనేవారిని మాల్ధారీలు అంటారు. చాలాకాలం క్రితం వీరు యూపీ, రాజస్థాన్ నుంచి వచ్చి గిర్ అభయారణ్యం అంచుల వెంట స్థిరపడ్డారు. పశువులు, మేకలు, గొర్రెల పెంపకం.. పాల విక్రయం వీరి ప్రధాన వృత్తులు.
గొడవ ఏమిటి?
గుజరాత్లోని పట్టణాలు, నగరాల్లోకి పశువులు, మేకలు, గొర్రెలు, గాడిదల వంటి జంతువులు ప్రవేశించటాన్ని నిషేధించేందుకు బీజేపీ ప్రభుత్వం గత మార్చిలో ‘ది గుజరాత్ క్యాటిల్ కంట్రోల్ (కీపింగ్ అండ్ మూవింగ్) ఇన్ అర్బన్ ఏరియాస్ బిల్-2022’ను రూపొందించింది. దీన్ని అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపారు. ఈ బిల్లు చట్టంగా మారితే రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 162 మున్సిపాలిటీల్లోకి పశువుల ప్రవేశం కష్టతరం అవుతుంది. పట్టణాల్లోకి పశువులను తరలించాలన్నా, పెంచుకోవాలన్నా లైసెన్స్ తీసుకోవటం తప్పనిసరి. లైసెన్స్ తీసుకొన్న 15 రోజుల్లోగా పశువుల యజమానులు పశువులన్నింటికీ ట్యాగులు వేయాలి. ఒకవేళ పశువులు కట్లు తెంపుకొని రోడ్డుపైకి వస్తే దాని యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయొచ్చు. ఆ నేరానికి ఐదేండ్ల కఠిన జైలుశిక్షతోపాటు రూ.5లక్షల వరకు జరిమానా విధించేలా బిల్లును రూపొందించారు.
గడగడ వణికిన బీజేపీ
బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాల్ధారీలు కొన్నిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆ ఆందోళన మంగళవారం హింసాత్మకంగా మారింది. అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్ వంటి ప్రధాన నగరాలతోపాటు రాష్ట్రం నలుమూలల మాల్ధారీలు రోడ్లను దిగ్బంధించారు. పాల విక్రయాన్ని స్వచ్ఛందంగా నిలిపేశారు. దీంతో మంగళవారం ఉదయం నుంచే పాల కొరత ఏర్పడింది. పాలు దొరక్క ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ ప్రభు త్వం వణికిపోయింది. ఆగమేఘాల మీద గవర్నర్ను సంప్రదించి బిల్లును వెనక్కి తీసుకొన్నది.