పాట్నా, జూన్ 1: కేంద్రప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో సొంతంగా కులగణన నిర్వహించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ ప్రకటన చేసింది. కేంద్రంలోని బీజేపీ కుల జనగణనను వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం నితీశ్ కుమార్ కులగణనపై బీజేపీ వ్యతిరేక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అఖిల పక్ష సమావేశం అనంతరం సీఎం నితీశ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని అన్ని పార్టీలు కులగణనకు మద్దతిచ్చాయి’ అని చెప్పారు. ఈ తీర్మానానికి రాష్ట్ర క్యాబినెట్ త్వరలోనే ఆమోదం తెలుపుతుందని పేర్కొన్నారు. బీహార్లోని బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు కిందటేడాది ప్రధాని మోదీని కలిశారు. జాతీయ స్థాయిలో కులగణనను నిర్వహించాలని కోరారు. అయితే, కులగణన చేయబోమని కేంద్రం తేల్చి చెప్పింది.