హైదరాబాద్, జనవరి 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఇక వైద్య బీమా ఉంటే చాలు, ఏ దవాఖానలోనైనా డబ్బులు లేకుండా(నగదు రహిత) చికిత్స పొందొచ్చు. మీ దగ్గర ఏ కంపెనీ వైద్య బీమా ఉన్నా ఆపత్సమయాలతో పాటు, ఇతర వైద్య సేవలకు కూడా ఏ ప్రైవేటు దవాఖానలోనైనా నగదు రహిత వైద్యం పొందవచ్చు. ఈ నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి వచ్చినట్టు ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రకటించింది.
గతంలో బీమా కంపెనీల జాబితాలో ఉన్న దవాఖానల్లోనే క్యాష్ లెస్ చికిత్స పొందే అవకాశం ఉండేది. ఒక వేళ జాబితా(నెట్వర్క్)లో లేని దవాఖానల్లో చికిత్స పొందితే రీయంబర్స్మెంట్ (ముందు డబ్బులు చెల్లించి, తరువాత చెల్లింపులను పొందే) పొందే నియామాలు అమలులో ఉండేవి. కానీ వినియోగ దారుల ఇబ్బందుల దృష్ట్యా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించి, ప్రతి చోటా నగదు రహిత వైద్య సేవల సదుపాయాన్ని తీసుకొచ్చింది. తాజా నిర్ణయంతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారికి ఎంతో లాభం కలుగుతుందని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రకటించింది.