బెంగళూర్ : ఓ వివాదం నేపధ్యంలో పన్నెండు మంది దళిత మహిళలను గృహ నిర్భందం చేసినందుకు కాఫీ ఎస్టేట్ యజమాని, బీజేపీ నేత జగదీష్ గౌడ, ఆయన కుమారుడిపై చిక్మగళూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గర్భిణిని వేధించాడనే ఆరోపణలు కూడా బీజేపీ సభ్యుడిపై నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. హునసెహళ్లి గ్రామంలో 14 మంది దళిత మహిళలను హౌస్ అరెస్ట్ చేసిన కేసులో జగదీష్ గౌడతో పాటు ఆయన కుమారుడు తిలక్పై కేసు నమోదైందని చిక్మగళూర్ ఎస్పీ వెల్లడించారు.
వీరిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైందని తెలిపారు. ఈ దాడికి ముందు బాధిత మహిళ మరిదితో గౌడకు పిల్లల విషయంలో గొడవ జరిగిందని, మాటామాట పెరగడంతో కుటుంబ సభ్యులపై గౌడ దాడిచేశాడని పోలీసులు వెల్లడించారు. మరుసటి రోజు తాము పనికి వెళ్లకపోవడంతో ఎందుకు పనికి రాలేదని గౌడ అడిగాడని, తమను కొడుతున్నందుకే తాము రావడం లేదని చెప్పగా తమను రోజంతా నిర్భందించాడని బాధిత మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు.
కాగా ఈ వారంలో ఈ తరహా ఘటన మరొకటి వెలుగుచూసింది. చిక్బళాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో 14 ఏండ్ల బాలుడిని చోరీ చేశాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. అగ్రవర్ణాలకు చెందిన నిందితులు చోరీ చేశాడనే అనుమానంతో బాలుడిని అమానుషంగా వేధించారని పోలీసులు తెలిపారు.