బెంగళూరు: పార్లమెంట్లో ఇటీవల అలజడి సృష్టించిన ఇద్దరు వ్యక్తులకు విజిటర్ పాసులు ఇచ్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (MP Pratap Simha) పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఎంపీ సోదరుడు విక్రం సింహ (Vikram Sinha) వంతు వచ్చింది. అటవీ శాఖకు చెందిన భూమిలో అక్రమంగా 120 చెట్లు నరికి, కలపను స్మగ్లింగ్ చేశాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదుచేశారు. హసన్ జిల్లాలోని నందగొందనహళ్లి గ్రామంలోని 12 ఎకరాల్లో అటవీ భూమి విస్తరించి ఉంది. దాని పరిరక్షణకు ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు.
అయితే గత 15 రోజులుగా అటవీ భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా 120 చెట్లను నరికినట్లు, కలపను అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఎంపీ సోదరుడు విక్రమ్ సింహా పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తహసిల్దార్ మమత ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
కాగా, ఈ ఘటనపై అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖంద్రె స్పందించారు. 15 రోజులకుపైగా సాగిన ఈ ఆపరేషన్లో విక్రమ్ సింహా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఒప్పందం ప్రకారం ఆ భూమిలో అల్లం పెంచాల్సి ఉన్నదని అయిదే దానికి విరుద్ధంగా చెట్లను నరికారని చెప్పారు.