లక్నో: కారులో వ్యక్తులున్నప్పటికీ దానిని క్రేన్తో లాక్కెళ్లారు. సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. కారు డ్రైవర్ సునీల్, తన స్నేహితుడితో కలిసి కొన్ని వస్తువులు కొనుగోలు కోసం హజ్రత్గంజ్లోని జనపథ్కు వెళ్లాడు. కారు నుంచి ఇంకా కిందకు దిగని వారిద్దరు ఏం కొనాలి అన్నది చర్చించుకుంటున్నారు.
అయితే నో పార్కింగ్ ఏరియాలో కారు ఉండటాన్ని కాంట్రాక్ట్ సిబ్బంది గమనించారు. దీంతో వెంటనే క్రేన్ వాహనంతో అక్కడకు వచ్చారు. కారు లోపల వ్యక్తులు ఉన్నప్పటికీ దానిని లాక్కెల్లారు. కారు డ్రైవర్ సునీల్, అతడి స్నేహితుడు కేకలు వేస్తున్నప్పటికీ సిబ్బంది పట్టించుకోలేదు.
కాగా, కొందరు స్థానికులు తీసిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నిబంధనల ప్రకారం వ్యక్తులు కారు లోపల ఉన్నప్పుడు ఆ వాహనాలను క్రేన్ ద్వారా లాక్కెళ్ల కూడదు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై లక్నో మున్సిపల్ కమిషనర్ దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే నో పార్కింగ్ నుంచి కార్లను లాగే అన్ని క్రేన్ ఆపరేటర్ల కాంట్రాక్ట్ను రద్దు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు తర్వాత సంబంధిత క్రేన్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామన్నారు.