సీతాపూర్: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కారు దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. అయితే రైతుల మీదకు దూసుకువెళ్లిన ఆ కారు తమదే అని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. కానీ ఆ కారులో తమ కుమారుడు లేడని ఆయన స్పష్టం చేశారు. కారు దూసుకువెళ్లడం, ఆ తర్వాత హింస చెలరేగిన సమయంలో అక్కడ తాను కానీ, తన కుమారుడు కానీ లేరని మంత్రి తెలిపారు. రైతులపైకి వెళ్లిన మహేంద్ర థార్ కారు తమదే అని మొదటి రోజు నుంచి చెబుతున్నానని, అది మా పేరు మీదే రిజిస్టర్ అయి ఉందని, తమ పార్టీ వర్కర్లను పికప్ చేసుకునేందుకు వెళ్తోందని, ఆ సమయంలో మా కొడుకు మరో వేదిక వద్ద ఉన్నారని, మరో ఈవెంట్ను అతను ఆర్గనైజ్ చేస్తున్నాడని మంత్రి తెలిపారు. లఖింపుర్ హింస సమయంలో మరో చోట తమ కుమారుడు ఉన్నాడని, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని, కాల్ రికార్డులు, సీడీఆర్, లొకేషన్లను చెక్ చేస్తే ఆ విషయం తెలుస్తుందని మంత్రి అన్నారు. ఆశిష్ మిశ్రా మరో చోటు ఉన్నాడన్న విషయంలో అఫిడవిట్ ఇచ్చేందుకు వేల మంది ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. తమకు కారుకు చెందిన డ్రైవర్ మృతిచెందాడని, అతనితో పాటు మరో ఇద్దరు పార్టీ కార్యకర్తలు కూడా మృతిచెందినట్లు చెప్పారు. కారుతో పాటు మరో ఫార్చునర్ను కాల్చేశారని, వాళ్లు రైతులు కాదు అని, రైతుల ముసుగులో దాగి ఉన్న తీవ్రవాదులని మంత్రి పేర్కొన్నారు.