గాంగ్టక్ : ఉత్తర సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు వాహనం డ్రైవర్ మృతి చెందారు. పర్యాటక కేంద్రమైన లాచుంగ్కు 13కిలోమీటర్ల దూరంలో కెడుంగ్బీర్ వద్ద శనివారం రాత్రి సమయంలో ఘటన చోటు చేసుకుందని పోలీసులు ఆదివారం తెలిపారు.
సెలవుల నేపథ్యంలో సిక్కిం వచ్చిన కుటుంబం రాజధాని గాంగ్టక్ నుంచి లాచుంగ్కు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని పేర్కొన్నారు. మృతులను సురేష్ పునమియా, తురల్ పునమియా, హీరాల్ పునమియా, దేవాన్షి పునమియా, జయన్ పరిమార్, డ్రైవర్ సోమి విశ్వకర్మగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సైన్యం, స్థానికుల సహకారంతో పోలీసులు ఆదివారం మృతదేహాలను వెలికితీశారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.