న్యూఢిల్లీ: ఢిల్లీలో తాజాగా జరిగిన జీ20 దేశాల సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అవమానకరమైన స్వాగతం, అనుభవాలు ఎదురయ్యాయని ఆ దేశ నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనిపై తమ ప్రధాని ట్రూడోపై కెనడా పౌరులు విమర్శలు చేస్తున్నారు. భారత ప్రధాని మోదీ ఇతర దేశాల నేతలను స్వాగతించినట్టుగా.. ట్రూడో భారత్లో ల్యాండ్ అయిన సమయంలో ఆయన్ను స్వాగతిస్తూ ‘వెల్కమ్ నోట్’ పోస్టు చేయలేదని వారు ప్రస్తావిస్తున్నారు. మోదీ, ట్రూడో మధ్య జరిగిన సమావేశంలో కెనడాలో జరుగుతున్న ఖలిస్థానీ ఆందోళనల పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ కఠినంగా, విమర్శనాత్మకంగా మాట్లాడారని పేర్కొంటున్నారు. కెనడా ప్రధానిని పదేపదే అవమానించడాన్ని ఎవరూ ఇష్టపడరని ఆ దేశ ప్రతిపక్ష నేత పియర్ పోయిలీవ్రే ఎక్స్లో పోస్టు చేశారు. రాజ్ఘాట్ సందర్శన సందర్భంగా ట్రూడోకు షేక్హ్యాండ్ ఇచ్చిన మోదీ.. ముందుకు వెళ్లమని సైగ చేశారని పేర్కొంటూ ‘ది టోరంటో సన్’ అనే కెనడా ప్రముఖ వార్తాపత్రిక ఈనెల 10న కథనం ఇచ్చింది.