Canada Bill : ఆన్లైన్ మాయాజాలం, సోషల్ మీడియా వ్యసనం నుంచి చిన్నారులను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త విప్లవం మొదలైంది. చేతిలో స్మార్ట్ఫోన్ (Smart Phone) పట్టుకుని లోకాన్ని మరిచిపోతున్న బాల్యాన్ని రక్షించుకోవడానికి డిజిటల్ సరిహద్దులు (Digital Boarders) సిద్ధమవుతున్నాయి. అల్గారిథమిక్ రికమెండేషన్ల ఉచ్చులో పడి ఆందోళన, ఒంటరితనం, డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్న నేటి తరాన్ని వాస్తవ ప్రపంచంలోకి మళ్లించేందుకు కఠినమైన చట్టాల అవసరం ప్రపంచ దేశాలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా (Social Media) ను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన నూతన డిజిటల్ సేఫ్టీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఆన్లైన్ ద్వారా కలిగే హానికరమైన ప్రభావాలు అత్యంత తీవ్రంగా ఉన్నాయని, పిల్లల భద్రతను ఏమాత్రం విస్మరించకూడదని ఈ సందర్భంగా కెనడియన్ ఐడెంటిటీ అండ్ కల్చర్ మినిస్టర్ మార్క్ మిల్లర్ స్పష్టంచేశారు. అయితే నిర్దేశిత భద్రతా ప్రమాణాలను పాటించే ప్లాట్ఫామ్లకు ఈ నిబంధనల నుంచి కొత్త చట్టం మినహాయింపు ఇస్తుంది. నిబంధనలను ఉల్లంఘించి పిల్లలకు యాక్సెస్ ఇచ్చే కంపెనీలపై కెనడా సర్కారు కఠిన చర్యలు తీసుకోనుంది. అదేవిధంగా అనుమతి లేకుండా షేర్ చేసే అశ్లీల చిత్రాలను రిపోర్ట్ చేసిన 24 గంటల్లోగా ఆయా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని ఈ బిల్లు స్పష్టంచేస్తున్నది.
అంతేగాక AI చాట్బాట్లను పర్యవేక్షించడానికి, వాటికి భద్రతా ప్రమాణాలను రూపొందించడానికి ఒక ప్రత్యేక డిజిటల్ రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేయాలని కెనడా ప్రభుత్వం యోచిస్తున్నది. ఓపెన్ఏఐ సంస్థపై ఆ దేశంలో నమోదైన న్యాయపరమైన వ్యాజ్యాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన రావడం గమనార్హం. పిల్లలను సోషల్ మీడియా మాయాజాలం నుంచి కాపాడి, వారు వాస్తవ ప్రపంచంలో మెరుగైన నైపుణ్యాలను అలవర్చుకునేలా ప్రోత్సహించడానికి ఈ చట్టం తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ బిల్లు పూర్తిగా ఆమోదం పొంది, అమలులోకి రావడానికి దాదాపు రెండేళ్లపైనే సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
కాగా, ఇప్పటికే ఆస్ట్రేలియా, మలేషియా తదితర దేశాలు 16 ఏళ్ల లోపు పిల్లలపై పూర్తి స్థాయి నిషేధాన్ని విధించగా.. బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాలు పాక్షిక ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మరోవైపు ఫ్రాన్స్, డెన్మార్క్, పోలాండ్ దేశాలు సైతం కఠినమైన నిబంధనలను పరిశీలిస్తున్నాయి. గ్రీస్ దేశం సైతం అడుగు ముందుకు వేసి 15 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై నిషేధాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ దేశాల బాటలోనే భారతదేశంలో కూడా పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో చవకైన ఇంటర్నెట్ లభ్యత కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా కోట్ల మంది బాలలు స్మార్ట్ఫోన్లకు బానిసలవుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వ్యసనం చదువులను దెబ్బతీస్తుంది. కొందరు రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.