న్యూఢిల్లీ, అక్టోబర్ 12: న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే జీ20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల శిఖరాగ్ర సమావేశానికి కెనడా హాజరు కావడం లేదు. ఈ సమావేశానికి హాజరు కారాదని కెనడా సెనెట్ స్పీకర్ రేమాండ్ గాగ్నే నిర్ణయించారు. ఇటీవల ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై భారత్-కెనడా మధ్య దెబ్బతిన్న దౌత్యపరమైన సంబంధాల కారణంగా ఈ సమావేశానికి హాజరు కారాదని కెనడా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని నిర్ధారించిన కెనడా విదేశాంగ శాఖ తమ దేశం నుంచి ఈ సదస్సుకు ఎవరూ హాజరు కావడం లేదని స్పష్టం చేసింది. కాగా, ఈ జీ20 సదస్సు న్యూఢిల్లీలోని యశోభూమిలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అడ్ ఎక్స్పో సెంటర్లో ఈ నెల 13,14 తేదీలలో జరుగుతుంది. జీ20 అధ్యక్ష హోదాలో భారత్ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్నది.