Bihar | పట్నా, ఏప్రిల్ 10: మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న ఎన్డీయేకు ఈసారి బీహార్లో బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు కలిసొచ్చిన బీహార్లో ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతున్నది. ఈసారి 400 లోక్సభ స్థానాలను సొంతం చేసుకోవాలనుకుంటున్న ఎన్డీయే.. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు బీహార్ అత్యంత కీలకమైన రాష్ట్రం. ఇక్కడ 2014 ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ బీజేపీ, ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీతో కూడిన ఎన్డీయే కూటమి 31 స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఏకంగా 40 స్థానాలకు 39 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఇదే స్థాయిలో స్థానాలను గెలవాలని ఎన్డీయే భావిస్తున్నప్పటికీ అది అంత సులువైన పనిలా కనిపించడం లేదు.
గత ఎన్నికలకు, ఇప్పటికి బీహార్లో రాజకీయ సమీకరణాలు మారినట్టు స్పష్టమవుతున్నది. 2019 ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీయే కూటమికి 53 శాతం ఓటు బ్యాంకు లభించింది. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ – కాంగ్రెస్ కూటమిగా పోటీ చేయగా 31 శాతం ఓట్లను సాధించింది. సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్ పార్టీలు వేరు కూటమిగా పోటీ చేసి 3 శాతం ఓట్లు సాధించాయి. ఇప్పుడు మాత్రం ఈ మూడు కమ్యూనిస్టు పార్టీలూ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్కు ఇప్పుడు కమ్యూనిస్టుల బలం కలిసి రానున్నది. మరోవైపు గత ఎన్నికల్లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ ఇప్పుడు రెండుగా చీలింది. రామ్విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్ఎల్జేపీ) ఎన్డీయే నుంచి బయటకు రావడం మైనస్ కావచ్చు. గత ఎన్నికల్లో పార్టీలు సాధించిన ఓట్లను బట్టి చూస్తే ఎన్డీయే బలం తగ్గగా, ఇండియా కూటమి బలం పెరిగినట్టు కనిపిస్తున్నది.
బీహార్కు తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. ఈ ఎన్నికల్లో ఎన్డీయేతో పొత్తులో భాగంగా నితీశ్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ మాత్రం 17 స్థానాల్లో బరిలో దిగుతున్నది. తద్వారా బీహార్ వరకు ఎన్డీయే కూటమిలో బీజేపీనే పెద్ద పార్టీగా మారింది. తరచూ కూటములు మార్చడం, మొన్నటి వరకు ఇండియా కూటమిలో ఉండి బీజేపీని విమర్శించి ఇప్పుడు అదే పార్టీతో జట్టు కట్టడం వంటి అంశాల వల్ల బీహార్ ప్రజల్లో నితీశ్ విశ్వసనీయత తగ్గుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లాలూ వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ఇప్పుడు బీహార్లో ప్రధాన నాయకుడిగా అవతరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్లో ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలిపిన ఘనత తేజస్వీదే. ఇప్పుడు ఇండియా కూటమిలోనూ ఆర్జేడీనే 25 స్థానాలకు పోటీ చేస్తుండటం ద్వారా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీగా నిలిచింది. తేజస్వీ యాదవ్ బీహార్ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పట్టు సంపాదించుకున్నారు. ఆయన వ్యక్తిగత చరిష్మా ఈసారి ఇండియా కూటమికి కలిసొచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లోలా ఈసారి బీహార్లో క్లీన్స్వీప్ చేసే పరిస్థితులు ఎన్డీయేకు లేవని ఆ కూటమి నేతలు కూడా అంగీకరిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలను ఎన్డీయే పునరావృతం చేయడం కష్టమేనని జేడీయూ నేత నీరజ్ కుమార్ పేర్కొన్నారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం ఎన్డీయేపై చూపించే అవకాశాలు ఉన్నాయి. సామాజిక సమీకరణాలను చూస్తే.. ఆర్జేడీ మొదటి నుంచి ముస్లిం – యాదవ ఓట్లను ఓటుబ్యాంకుగా మలుచుకున్నది. అయితే, దళితుల్లో పట్టున్న చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ భాగస్వామిగా ఉండటం ఎన్డీయేకు కలిసి రావచ్చు. నితీశ్ కుమార్కు వెనుకబడిన వర్గాలు, కుర్మి, కోయిరి సామాజికవర్గాల్లో ఆదరణ ఉంది.