MBBS-MPC | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఇంటర్లో ఎంపీసీలో చేరిన తర్వాత కొన్నాళ్లకు.. మనం కూడా మెడిసిన్ చదివి డాక్టర్ అయితే బాగుండు అని చాలా మంది విద్యార్థులు ఆలోచిస్తుంటారు. తాము అనవసరంగా ఎంపీసీ తీసుకున్నామని బాధపడుతుంటారు.
ఇలాంటి విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తీపి కబురు అందించింది. ఎంపీసీ చదివినా నీట్ యూజీ పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన వారికి మాత్రమే నీట్ రాసే అవకాశం ఉండేది. తర్వాత బయో టెక్నాలజీ చదివిన వారికి కూడా అవకాశం కల్పించారు. తాజాగా మ్యాథ్స్ చదివిన విద్యార్థులకు కూడా నీట్ రాసేందుకు అనుమతి ఇచ్చింది.
అయితే వారు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలని, అదనంగా ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ లేదా బయోటెక్నాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకొని, ఉత్తీర్ణులు కావాలని నిబంధన విధించింది. వారు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు చేసేందుకు అర్హులని పేర్కొన్నది. వచ్చే ఏడాది విడుదల చేయనున్న నీట్ యూజీ నోటిఫికేషన్ నుంచే వీరికి అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.