న్యూఢిల్లీ: లైట్ మోటార్ వెహికల్స్ కోసం డ్రైవింగ్ లైసెన్సు(Driving License) తీసుకున్న వారు.. సుమారు 7500 కేజీల బరువున్న ట్రాన్స్పోర్టు వాహనాల్ని నడపాలా వద్దా అన్న అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఓ విధాన నిర్ణయాన్ని తీసుకోవాలని సూచన చేసింది. డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన అంశం.. లక్షలాది మంది ప్రజలపై ప్రభావం చూపిస్తుందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేపథ్యంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ఎల్ఎంవీ లైసెన్సు ఉన్నవాళ్లు.. ఎటువంటి వాహనాల్ని నడపాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండు నెలల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుని కోర్టుకు విన్నవించాలని సీజే తెలిపారు.
రోడ్డు భద్రత, పబ్లిక్ ట్రాన్స్పోర్టు భద్రతకు సంబంధించిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఎల్ఎంవీ లైసెన్సు ఉన్నవాళ్లు.. ట్రాన్స్పోర్టు వాహనం నడపవచ్చా అన్న విషయంపై అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సూచనల్ని సుప్రీంకోర్టు తీసుకున్నది. ఈ అంశంపై సుప్రీంలో మొత్తం 76 పిటీషన్లు నమోదు అయ్యాయి. సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ హృషికేశ్ రాయ్, పీఎస్ నర్సింహా, పంకజ్ మిటల్, మనోజ్ మిశ్రా ఉన్నారు.