చండీగఢ్: రాష్ట్రంలో అద్దెదారుల తనిఖీన బలోపేతం చేస్తామని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ గేట్ వద్ద ఖలిస్థాన్ జెండాలు ఉంచడం కలకలం రేపింది. దీనికి సంబంధించి పంజాబ్కు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో హర్యానాలో అద్దెదారుల తనిఖీని బలోపేతం చేయడానికి ప్రచారం ప్రారంభిస్తామని హోం మంత్రి అనిల్ విజ్ చెప్పారు. తద్వారా తెలియని వ్యక్తులెవరూ నకిలీ గుర్తింపుతో అద్దె ఇంట్లో నివసించకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా, హర్యానాలో ఉగ్రవాద చర్యల నియంత్రణకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఏర్పాటు చేస్తామని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఇందులో డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులను కూడా నియమిస్తామని చెప్పారు. హర్యానాలోని రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, నేర సంఘటనలు జరిగే భవనాల్లో నైట్ విజన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ దిశగా చర్యలు చేపడతామన్నారు.