Patna High Court | పాట్నా, మార్చి 30: ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ‘భూతం, పిశాచి’ అంటూ పిలువడం క్రూరత్వం కిందకేమీ రాదని పాట్నా హైకోర్టు అభిప్రాయపడింది. ఓ విడిపోయిన భార్యాభర్తల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ వివేక్ చౌదరి తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. 21 శతాబ్దంలో కూడా భర్త తన భార్యను భూతం, పిశాచి అని పిలిచారని, ఇది తీవ్ర క్రూరత్వం కింద వస్తుందని మహిళ తరపు లాయర్ వాదనను న్యాయమూర్తి వ్యతిరేకించారు.
కేసు వివరాల్లోకి వెళితే కట్నం కోసం భర్త నరేష్ గుప్తా, మామ సహదేవ్ గుప్తా తనను హింసకు గురి చేస్తున్నారంటూ ఒక మహిళ 1994లో కేసు వేసింది. దీనిపై ఏడాది శిక్ష పడగా, అడిషనల్ సెషన్స్ కోర్టు 10 ఏండ్ల తర్వాత దానిని సమర్థించింది. ఈ మధ్య కాలంలో సదరు భార్యాభర్తలకు జార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. కింది కోర్టుల తీర్పులను సవాల్ చేస్తూ తండ్రీ కొడుకులు పాట్నా హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు వాటిని కొట్టివేసింది.