న్యూఢిల్లీ: కేంద్రం అమలులోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలుకు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్.. తాజాగా న్యూ గ్రీవియెన్స్ అధికారిగా జెరెమీ కెస్సెల్ను నియమిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం జెరెమీ కెస్సెల్.. సంస్థ గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్గా ఉన్నారు. కానీ ఐటీ రూల్స్ ప్రకారం సదరు గ్రీవియెన్స్ అధికారి భారత్ నివాసి అయి ఉండాలి.
ఇంతకుముందు నియమించిన తాత్కాలిక రెసిడెంట్ గ్రీవియెన్స్ అధికారి ధర్మేంద్ర చతూర్ ఆదివారం వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ధర్మేంద్ర చతూర్ను ఇంటరిం గ్రీవియెన్స్ అధికారిగా నియమించింది. కానీ ఆదివారం ఈ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
దీంతో భారతీయ సబ్స్క్రైబర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అధికారి లేకుండా ట్విట్టర్ను వదిలేశారు. ఐటీ రూల్స్ అమలు విషయంలో కేంద్రంతో వివాదం నెలకొన్న నేపథ్యంలో ధర్మేంద్ర చతూర్ వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
సోషల్ మీడియా నియంత్రణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియేటరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్-2021ను కేంద్రం ఆమోదించింది. గత నెల 25 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి.
న్యూ ఐటీ రూల్స్కు కట్టుబడి ఉండటంలో ట్విట్టర్ ఉద్దేశ పూర్వకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నదని కేంద్రం మండి పడింది. ఈ నిబంధనల ప్రకారం ఆయా సోషల్ మీడియా వేదికల్లో వచ్చే పోస్టులపై ఫిర్యాదులను పరిష్కరించడానికి గ్రీవియెన్స్ అధికారిని నియమించాల్సి ఉంటుంది.
50 లక్షల మందికి పైగా యూజర్లు గల అన్ని సోషల్ మీడియా వేదికలు గ్రీవియెన్స్ అధికారిని నియమించాయి. అంతటితో ఆగక ఆ వివరాలను తమ వెబ్సైట్ల్లో పొందుపరిచాయి. కానీ ట్విట్టర్ మీన మేషాలు లెక్కించింది.
తమ ఐటీ నిబంధనల అమలుకు కట్టుబడి ఉన్నారా? లేదా? అన్న విషయమై ఈ నెల ఐదో తేదీన ట్విట్టర్కు కేంద్రం చివరి నోటీసు జారీ చేసింది. దీంతో ట్విట్టర్.. ధర్మేంద్ర చతూర్ను ఇంటరిం రెసిడెంట్ గ్రీవియెన్స్ అధికారిగా నియమించింది.
ధర్మేంద్ర చతూర్ స్థానే నియమితులైన జెరెమీ కెస్సెల్ చిరునామా అమెరికాలో ఉందని ట్విట్టర్ వెబ్సైట్ పేర్కొంటున్నది. సకాలంలో స్పందించడంలో విఫలమైన ట్విట్టర్.. న్యాయ రక్షణను కోల్పోయింది.
ఇప్పటి వరకు ఉన్న మధ్యవర్తిత్వ హోదా కోల్పోవడంతో ట్విట్టర్లో వచ్చే పోస్టులకు సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది.