(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వ ‘ఆయుష్మాన్ భారత్ (పీఎంజేఏవై)’ పథకం అవకతవకలకు అడ్డాగా, అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. వాడుకలో లేని ఒకే ఫోన్ నంబర్పై ఈ పథకం కింద ఏకంగా 7.50 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయంటే స్కీమ్ అమలులో ఎన్ని లోటుపాట్లు జరుగుతున్నాయో అర్థమవుతున్నది. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) మంగళవారం పార్లమెంట్లో ఓ నివేదికను సమర్పించింది.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎన్ఎస్ఏపీ)లోనూ అవకతవకలు గుర్తించినట్టు కాగ్ మరో నివేదికలో వెల్లడించింది. మరణించిన తర్వాత కూడా 2,103 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు ప్రక్రియ కొనసాగిందని, 2017-21 మధ్య జరిగిన ఆడిట్లో ఈ విషయాన్ని గుర్తించినట్టు పేర్కొంది. ఈ తరహా అవకతవకలు జరిగిన రాష్ర్టాల్లో బెంగాల్ (453 కేసులు), గుజరాత్ (413 కేసులు), త్రిపుర (250 కేసులు) అగ్రస్థానాల్లో ఉన్నట్టు తెలిపింది.