CAG | న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఆడిటింగ్కు కీలకమైన ఫీల్డ్వర్క్ను వెంటనే ఆపేయాలంటూ కాగ్ అధికారులకు ఈ నెల మొదటి వారంలో ‘మౌఖిక ఆదేశాలు’ జారీ కావడమే ఈ పరిస్థితికి కారణం. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ద్వారకా ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టుతోపాటు ఆయుష్మాన్ భారత్, భారత్మాల పథకాల్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేసిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్లను కేంద్రం ఇటీవలే బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఆదేశాలు జారీ కావడం గమనార్హం. దీనిపై ‘వైర్’లో సమగ్ర వార్తాకథనం రావడంతో బీజేపీ సర్కారుపై కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ తదితర విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.
ఫీల్డ్ వర్క్ కీలకం..
మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల ఆడిటింగ్కు ఫీల్డ్ వర్క్ ఎంతో కీలకం. దీని ద్వారా కాగ్ అందించే నివేదికలు ప్రభుత్వ ఖర్చులతోపాటు ఆర్థిక అంశాల్లో జవాబుదారీతనం పెంపునకు ఉపకరిస్తాయి. ఈ నివేదికల రూపకల్పన కోసం కాగ్ సిబ్బందిలో 30 నుంచి 40 శాతం మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటారు. అయితే రాతపూర్వక ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రమే ఫీల్డ్వర్క్ను ఆపాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందికి సూచిస్తామని కాగ్ కార్యాలయ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. కేవలం మౌఖిక ఆదేశాలను అనుసరించి ఫీల్డ్వర్క్ను ఆపాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందికి సూచిస్తే భవిష్యత్తులో తాము విచారణను లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని, తర్వాత వచ్చే ప్రభుత్వాలతోపాటు ప్రస్తుత ప్రభుత్వం సైతం తమను వివాదాల్లోకి లాగవచ్చని ఆ అధికారులు భయపడుతున్నట్టు సమాచారం.
కొత్త నివేదికలపై సంతకం చేయని కాగ్
మరోవైపు తాను కొత్తగా ఎలాంటి నివేదికలపై సంతకాలు చేయడం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీశ్ చంద్ర ముర్ము స్పష్టం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ (ఐఏఅండ్ఏఎస్) ఇంచార్జి ఆఫీసర్ కూడా సంతకాలు చేయాల్సిన ఈ నివేదికలపై జీసీ ముర్ము సంతకం లేకపోతే వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు వీలుండదు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న జీసీ ముర్ము గుజరాత్ క్యాడర్కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2020లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్కు ఆయనే తొలి లెఫ్టినెంట్ గవర్నర్.