న్యూఢిల్లీ: భారత్, నేపాల్ మధ్య వంతెన నిర్మాణం ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్, నేపాల్ మధ్య ఉన్న మహాకాళి నదిపై వంతెన నిర్మాణానికి సంబంధించి ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి ఈ సందర్భంగా ఆమోదం తెలిపారు. నేపాల్ సమీపంలోని ఉత్తరాఖండ్ ధార్చుల ప్రాంత ప్రజలకు ఈ వంతెన నిర్మాణం ఎంతో సహాయపడుతుందని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేబినెట్ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఏడు రాష్ట్రాల్లో దాదాపు 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల గ్రిడ్ ఇంటిగ్రేషన్, పవర్ తరలింపును సులభతరం చేయడానికి ఇంట్రా-స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కింద గ్రీన్ ఎనర్జీ కారిడార్ 2వ దశకు కేబినెట్ ఆమోదం లభించినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రూ.12,031 కోట్లతో చేపట్టే ఈ పథకం 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడానికి, దీర్ఘకాలిక ఇంధన భద్రతకు దోహదపడుతుందని చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై చర్చించడానికి కేబినెట్ భద్రతా కమిటీ (సీసీఎస్) గురువారం సమావేశమైంది.