న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన ‘విశ్వకర్మ’ పథకం కోసం రూ.13 వేల కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చేతివృత్తి కళాకారులకు రాయితీపై 5 శాతం వడ్డీరేటుతో రుణాలు ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అయితే ఈ పథకానికి కేంద్రం అనేక కొర్రీలు పెట్టింది. తొలుత రూ. లక్ష వరకే రుణం ఇస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకుంటే రెండో విడత కింద రూ.2లక్షల రుణం ఇస్తామని పేర్కొన్నది. చేతివృత్తి కళాకారులకు నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు శిక్షణ అందిస్తామని మంత్రి తెలిపారు. శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. రూ.14,903 కోట్లతో డిజిటల్ ఇండియా పథకం పొడిగింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. దీని కింద 5.25 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్కు నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తామని, ఐటీలో 2.65 లక్షల మందికి శిక్షణ ఇస్తామని తెలిపారు.
రైల్వేకు సంబంధించి రూ.32,500 కోట్ల అంచనా వ్యయంతో ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రులు తెలిపారు. రైల్వే లైన్ల విస్తరణతో పాటు, రైళ్ల రాకపోకలు సజావుగా జరిగేలా చూడటం, రద్దీని తగ్గించడం వంటి చర్యలు ఉంటాయని వివరించారు. తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్లలోని 35 జిల్లాల్లో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు అమలవుతాయని పేర్కొన్నారు. పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు 169 నగరాల్లో పీపీపీ మోడల్ కింద 10 వేల ఈ-బస్సులతో ‘పీఎం ఈ-బస్ సేవ’ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.