CAA | నాలుగేండ్లుగా ఫ్రీజర్లో ఉన్న వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019ని మళ్లీ తెరపైకి తెచ్చింది కేంద్రం. దేశవ్యాప్తంగా సీఏఏని అమల్లోకి తెస్తూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల ముంగిట సీఏఏ అమల్లోకి తేవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. నాలుగేండ్ల కిందట ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, దీని కోసం వెబ్ పోర్టల్ను కూడా సిద్ధం చేసినట్టు హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య 2019 డిసెంబర్ 11న సీఏఏ బిల్లు-2019 పార్లమెంటు ఆమోదం పొందింది.
దీనికి అప్పటి రాష్ట్రపతి కోవింద్ సమ్మతి కూడా లభించింది. అయితే, దేశవ్యాప్తంగా పౌరుల ఆందోళనలు, అలాగే చట్టంలోని పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడం వెరసి ఇప్పటివరకూ సీఏఏ అమలు కార్యరూపం దాల్చలేదు. కాగా లోక్సభ ఎన్నికల ముందే సీఏఏను అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల పలుమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా ఈ చట్టాన్ని నోటిఫై చేసింది. సీఏఏ నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలోని సున్నిత ప్రాంతాల్లో పోలీసులను, పారా మిలిటరీ దళాలను భారీగా మోహరించారు.
ఏమిటీ సీఏఏ?
మతపరమైన హింస కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్ మతస్తులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏను తీసుకొచ్చారు. శరణార్థుల దగ్గర సరైన ధ్రువపత్రాలు లేనప్పటికీ పౌరసత్వాన్ని ఇస్తారు. 2014, డిసెంబర్ 31 కంటే ముందు వచ్చిన వారు మాత్రమే పౌరసత్వానికి అర్హులు.
అభ్యంతరాలు ఏమిటి?
1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టంలో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీసింది. ఈశాన్య రాష్ర్టాల్లో పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. ముస్లిం ఆధిపత్య దేశాల్లో మత హింస కారణంగా దేశంలోకి వలస వచ్చిన ముస్లిమేతరులకు ఈ పౌరసత్వ సవరణ చట్టం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. అయితే ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నదని, రాజ్యాంగ లౌకిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
చెలరేగిన మత ఘర్షణలు
సీఏఏకు ఆమోదం లభించిన తర్వాత తొలి ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలోని షాహీన్బాగ్, అస్సాం గువాహటి సహా పలు ప్రాంతాల్లో ముస్లింలు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆ తర్వాత మత ఘర్షణలు చెలరేగాయి. వంద మందికిపైగామరణించినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ తెగేసి చెప్పారు.
నాలుగేండ్లు పొడిగింపులు
సీఏఏకు రాష్ట్రపతి ఆమోదం లభించిన నాలుగేండ్లకు కేంద్రం తాజాగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఏదైనా చట్టాన్ని ఆరునెలల్లోగా నోటిఫై చేస్తూ కేంద్రం అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగడం, కరోనా, లాక్డౌన్ తదితర కారణాలతో సీఏఏ అమలుకు అవసరమైన నిబంధనలు ఏర్పాటుచేయడానికి మరింత సమయం పడుతుందంటూ పార్లమెంటరీ కమిటీ నుంచి కేంద్రం నిర్ణీత వ్యవధుల్లో ప్రత్యేక పొడిగింపు అనుమతులను తీసుకొన్నట్టు అధికారి ఒకరు తెలిపారు.
కేరళలో అమలు చేయబోం!
ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే సీఏఏను కేరళలో అమలు చేయబోం. ఈ చట్టాన్ని వ్యతిరేకించటానికి కేరళ ప్రజలంతా ఒక్క తాటిపైకి రావాలి.
– విజయన్, కేరళ సీఎం
వివక్ష చూపితే వ్యతిరేకిస్తాం
పౌరసత్వ సవరణ చట్టంతో ప్రజలపై వివక్ష చూపినట్టయితే తప్పకుండా వ్యతిరేకిస్తా. లోక్సభ ఎన్నికల ముంగిట అశాంతిని నేను కోరుకోవడం లేదు. అసలే ఈశాన్య రాష్ర్టాల్లో పరిస్థితి సున్నితంగా ఉన్నది.
– మమత, పశ్చిమ బెంగాల్ సీఎం
ఇది గాడ్సే ఆలోచనలో భాగం
పౌరసత్వ చట్టం విభజనతో కూడినది. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలనే గాడ్సే భావనతో ఇది నిండినది. సీఏఏ కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకోవటానికి ఉద్దేశించినది తప్ప మరెందుకు ఇది పనికి రాదు. మొదట ఎన్నికల సీజన్.. ఆ తర్వాత సీఏఏ నిబంధనలు.. ఈ వరుస క్రమాన్ని చూస్తేనే అసలు విషయం అర్థమవుతుంది. ఐదేళ్ల పాటు పెండింగ్ పెట్టి ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట దీన్ని ఎందుకు తెస్తున్నారో అర్థం చేసుకోండి.
– అసదుద్దీన్, ఎంఐఎం చీఫ్