కోల్కతా: పశ్చిమబెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నిక జరుగుతున్న స్థానాల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీ పూర్ కూడా ఉన్నది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసిన దీదీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గమైన భవానీ పూర్ నుంచి ఆమె బరిలోకి దిగింది. దీదీపై న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ను బీజేపీ పోటీకి నిలిపింది. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నది.
భవానీపూర్తోపాటు జాంగీపూర్, సంపేర్గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతున్నది. అక్టోబర్ 3న ఓట్లను లెక్కించనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో పోలింగ్కు అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భవానీపూర్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి సువేందు అధికారిపై ఆయన నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే స్వల్ప తేడాతో ఓడిపోయారు.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాయి. దీంతో ఆరు నెలల్లో ఏదో ఒక సభనుంచి ఆమె చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవానీపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సుభతా బక్షి.. దీదీ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన జంగీర్పూర్ నుంచి బరిలో నిలిచారు. భవానీపూర్లో 1,11,283 మంది పురుష, 95,209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నలుగురు ఇతర ఓటర్లు ఉన్నారు.