BWSSB | గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం నీటి సమస్యతో అల్లాడుతున్నది. రోజు రోజుకు నీటి ఎద్దడి తీవ్రమవుతున్నది. ఇప్పటికే తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగించొద్దని స్పష్టంగా ఆదేశించింది. ఆదేశాలను బేఖాతర్ చేస్తూ కార్ వాషింగ్, గార్డెనింగ్ తదితర పనులకు తాగునీటిని వినియోగించిన 22 కుటుంబాలకు వాటర్ సప్లయ్ బోర్డు జరిమానా విధించింది. ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB) తెలిపింది.
22 కుటుంబాల నుంచి రూ.1.1లక్షల జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. జరిమానా గరిష్ఠంగా రూ.80వేలు దక్షిణ బెంగళూరు ప్రాంతం నుంచి వసూలు చేసినట్లు చెప్పింది. సంక్షోభం దృష్ట్యా తాగునీటిని ఆర్థికంగా ఉపయోగించాలని ఈ నెల ప్రారంభంలో సీవరేజ్ బోర్డు కోరిన విషయం తెలిసిందే. వాహనాలను కడగడం, నిర్మాణం, వినోద ప్రయోజనాల కోసం తాగునీటిని ఉపయోగించకుండా ఉండాలని కోరారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించిన వారికి అదనంగా రూ.500 జరిమానా విధిస్తూ బోర్డు నిర్ణయించింది. ఆర్డర్ ఉల్లంఘించిన ప్రతిసారీ ఈ జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది. హోలీ వేడుకల సందర్భంగా పూల్ పార్టీలకు కావేరి నీరు, బోర్వెల్ నీటిని ఉపయోగించొద్దని సూచించింది.