లక్నో: నేపాల్ నుంచి భారత్కు తిరిగి వస్తున్న బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది భారత యాత్రికులు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ గొరఖ్పూర్ జిల్లాలోని పిపిగంజ్కు చెందిన 70 మంది భక్తులు నేపాల్లోని త్రివేణి ధామ్కు బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నేపాల్, భారత్ సరిహద్దులోని తితుబారి ప్రాంతం వద్ద ఆ బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సు ఒక పక్కకు ఒరిగిపోయింది. బస్సులోని 70 మంది యాత్రికుల్లో 60 మంది గాయపడ్డారు.
కాగా, బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న నేపాల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భారతీయ భక్తులను నేపాల్లోని నావల్ పరాసి జిల్లాలో ఉన్న పృథ్వీ చంద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లా కలెక్టర్ కూడా బస్సు ప్రమాదంపై స్పందించారు. గాయపడిన యాత్రికుల గురించి నేపాల్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అలాగే గాయపడిన వారికి సహాయం కోసం అధికారులను కూడా నేపాల్కు పంపారు.