డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 30 మందితో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డట్లు తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఆదివారం యమునోత్రి జాతీయ రహదారిపై దమ్టా సమీపంలో చోటు చేసుకున్నది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
మృతులంతా మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందిన వారిగా సమాచారం. అయితే, సంఘటనా స్థలం నుంచి 23 మృతదేహాలను బయటకు తీసినట్లు ఎస్హెచ్వో పురోల అశోక్కుమార్ తెలిపారు. మృతులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, ప్రమాదం నుంచి బస్ డ్రైవర్తో పాటు అతని భార్య ప్రాణాలతో బయటపడ్డారని, వారిని దమ్టాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విపత్తు నిర్వహణ కేంద్రం పేర్కొంది. డ్రైవర్ ఉదయ్ సింగ్కు గాయ్యాలయ్యాయి. రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది.
బస్సు లోయలో పడిపోయిన సందర్భంగా బస్సులో ఉన్న వారంతా పెద్ద ఎత్తున కేకలు వేయగా.. అక్కడున్న వారంతా సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. సంఘటనా స్థలమంతా రక్తంతో నిండిపోయింది. ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం బాధాకరమని పేర్కొన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు రూ.2లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఘటనలో మృతి చెందిన 23 మంది మృతదేహాలు సంఘటనా స్థలంలోనే ఉన్నాయని పురోల అశోక్ కుమార్ తెలిపారు. బస్సు 150-200 మీటర్ల లోతులో పడిపోవడంతో తీవ్ర గాయాలై మృతి చెందారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 28 మంది ఉన్నారు. భారీ లోయ కావడం, చీకటి కారణంగా మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి తరలించడం ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను మాత్రమే లోయలో నుంచి బయటకు వెలికి తీశారు.
మరో వైపు ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ప్రమాదం విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ వాసులు 23 మంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. అధికారుల బృందం ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో నిరంతరం అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎంతో కేంద్ర హోంమంత్రి అమిత్షా మాట్లాడారు.