లక్నో: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది. అది బోల్తా పడటంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 మంది పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సును మధుఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పురా సమీపంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు రోడ్డు దిగువన బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న పెళ్లి బృందానికి చెందిన ఐదుగురు చనిపోయారు. మరో15 మందికిపైగా గాయపడ్డారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన ఐదుగురి మృతదేహాలను కూడా పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆ బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వ్యక్తులు ఉన్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.