హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్పై యుద్ధోన్మాదంతో విరుచుకుపడి సామాన్యులను కూడా పొట్టన పెట్టుకొంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్కు మద్దతు తెలుపుతూ మనదేశంలో కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తులమని చెప్పుకొనే ఒక వర్గం వారు ‘ఐ స్టాండ్ విత్ పుతిన్’ అనే హ్యాష్ట్యాగ్ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్లో ఇప్పటికీ వేలమంది విద్యార్థులు చిక్కుబడిపోయారు. మంగళవారం రష్యా క్షిపణి దాడిలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. వందలమంది నీరు, ఆహారం దొరకక అలమటిస్తూ కిలోమీటర్ల దూరం కాలినడకన సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కేంద్రప్రభుత్వం అక్కడి విద్యార్థులను స్వదేశం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా వేలమంది అక్కడే ఉండిపోయి, ఏ క్షణం ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. ఏ దేశ పౌరులన్నది పట్టించుకోకుండా కనిపించిన ప్రతి వ్యక్తిని కాల్చేయాలని పుతిన్ తన సేనలకు ఆదేశాలిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్లోని భారతీయులు బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అందుకు కారణమైన పుతిన్కు మనదేశంలోని కొందరు మద్దతు తెలుపటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.