భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు బుందేల్ఖండ్ ప్రాంతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. అసలే వెనుకబడిన మధ్యప్రదేశ్లో అంతకంటే వెనుకబడిన ప్రాంతంగా బుందేల్ఖండ్కు పేరున్నది. పేదరికం, కరువు, కులాల కొట్లాటకు ఈ ప్రాంతం చిరునామా అని చెప్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో 26 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ గత 20 ఏండ్లుగా బీజేపీనే ఆధిపత్యం వహిస్తూ వస్తున్నది. అయినా పేదరికమూ పోలేదు.. ప్రజల రాత మారలేదు.
కాచుకొని కూర్చున్న ఎస్పీ, బీఎస్పీ
యూపీకి సరిహద్దుగా ఉండటంతో బుందేల్ఖండ్పై సమాజ్వాదీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ (బీఎస్పీ) పార్టీల ప్రాబల్యం కూడా అధికంగా ఉన్నది. మొత్తం 26 స్థానాల్లో ఆరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. ఎస్పీ, బీఎస్పీ ఎక్కువ సీట్లు గెలువలేకపోయినా ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలను తారుమారు చేయగలవని గత ఎన్నికల్లో నిరూపించాయి. 2018లో ఇక్కడ బీజేపీ 16, కాంగ్రెస్ 8, ఎస్పీ, బీఎస్పీ ఒక్కో సీటు గెలుచుకొన్నాయి. తర్వాత బీజేపీ బలం 18కి పెరగ్గా, కాంగ్రెస్ 7కు పడిపోయింది.
వలస బతుకుల అడ్డా
బుందేల్ఖండ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కరువు, వలసలు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఈ ప్రాంతం మాత్రం పేదరికాన్ని జయించలేకపోయింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు బుందేల్ఖండ్కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ డిమాండ్ చేయటంతో కేంద్రం రూ.7 వేల కోట్లతో అభివృద్ధి ప్యాకేజీ ఇచ్చింది. అయినా, పేదరికం పోలేదు. వలసలు ఆగలేదు. బీజేపీ పాలనలో బుందేల్ఖండ్ మరింత పేదరికంలోకి జారుకున్నదని నివేదికలు చెప్తున్నాయి. 2003లో మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన ఉమాభారతి ఈ ప్రాంతానికి చెందినవారే. అయినా, బుందేల్ఖండ్ రాత మారలేదు. బుందేల్ఖండ్ను అన్నిపార్టీలూ ఓట్లకోసం వాడుకొన్నాయే తప్ప.. ప్రజల ఆకలి బాధలు తీర్చాలని ప్రయత్నించలేదని సీనియర్ జర్నలిస్టు రషీద్ కిద్వాయ్ ఆవేదన వ్యక్తంచేశారు.