గౌహతి: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న బుల్డోజర్ సంస్కృతి తాజాగా అస్సాంకు చేరింది. లాకప్ డెత్ ఆరోపణలతో పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టిన నిందితుల ఇళ్లను బుల్డోజర్తో కూల్చివేశారు. నాగావ్ జిల్లాలోని బటద్రవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సాల్నాబరి ప్రాంత్రానికి చెందిన చేపలు అమ్మే సఫీకుల్ ఇస్లాంను, బటద్రవ స్టేషన్ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. లంచగా పది వేలు, ఒక బాతును డిమాండ్ చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మరోవైపు పోలీసుల కస్టడీలో ఉన్న సఫీకుల్ ఇస్లాంను చూసేందుకు అతడి కుటుంబ సభ్యులు శనివారం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే అతడు అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. దీంతో ఆసుపత్రికి వెళ్లి చూడగా మృతదేహం మార్చురీలో ఉన్నది. ఆగ్రహించిన సఫీకుల్ ఇస్లాం కుటుంబ సభ్యులు, సుమారు 200 మంది స్థానికులు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. నిప్పు పెట్టి అక్కడి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. లంచం ఇవ్వనందుకే సఫీకుల్ ఇస్లాంను పోలీసులు చంపారని అతడి కుటుంబం ఆరోపించింది.
కాగా, మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్న సఫీకుల్ ఇస్లాంను పోలీస్ స్టేషన్కు తరలించగా అనారోగ్యానికి గురై చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్కు స్థానికులు నిప్పు పెట్టిన ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడినట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనను అస్సాం ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టిన ఘటనపై దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసింది. 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుల అక్రమ ఇళ్లను అధికారులు ఆదివారం కూల్చివేసినట్లు వెల్లడించారు.
అలాగే సఫీకుల్ ఇస్లాం మరణంపై కూడా ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతున్నట్లు డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇంచార్జిని సస్పెండ్ చేసి సిబ్బందిని తొలగించినట్లు చెప్పారు. సఫీకుల్ ఇస్లాం మరణంలో ఏదైనా తేడా ఉంటే పోలీసులపైనా కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షలు పడేలా చూస్తామన్నారు.