జైపూర్: తాజాగా బీజేపీ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్కు బుల్డోజర్ యాక్షన్ (bulldozer action) వ్యాపించింది. కర్ణిసేన చీఫ్ను కాల్చి చంపిన నిందితుడి ఇంటిని అధికారులు కూల్చివేశారు. నిందితుల్లో ఒకరైన రోహిత్ రాథోడ్ ఇంటిని అక్రమంగా నిర్మించినట్లు జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఖతీపురాలోని ఆ ఇంటిని అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
కాగా, డిసెంబర్ 5న జైపూర్లోని ఇంట్లో ఉన్న రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ ఇంట్లోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ హత్య తామే చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా ఫేస్బుక్లో పేర్కొన్నాడు.
మరోవైపు డిసెంబర్ 9న రాజస్థాన్ పోలీసులు, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కర్ణిసేన చీఫ్ను కాల్చి చంపిన ఇద్దరు నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీతో పాటు అనుచరుడు ఉద్ధంను చండీగఢ్లో అరెస్టు చేశారు. భూ వివాదం నేపథ్యంలో రోహిత్ గోదారా, అతడి సన్నిహితుడు వీరేంద్ర చరణ్ ఆదేశాల మేరకు కర్ణిసేన చీఫ్ హత్య జరిగినట్లు పోలీసుల ముందు నితిన్ ఫౌజీ అంగీకరించాడు.