అహ్మదాబాద్: బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో నెల కిందట వేసిన రోడ్డు గుంతలమయంగా మారింది. వర్షాలకు రోడ్డులోని ఒక భాగం కుంగిపోయింది. పెద్ద గొయ్యిగా ఏర్పడిన అందులోకి భారీగా నీరు ఉబికి వచ్చింది. దీంతో రోడ్డుపై పెద్ద బావి మాదిరిగా తయారైంది. అహ్మదాబాద్లోని వస్త్రాల్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సుర్భి పార్క్ వద్ద నెల కిందట కొత్తగా రోడ్డు నిర్మించారు. అయితే ఆదివారం కురిసిన వర్షానికి మెట్రో రైల్ మార్గంలో పిల్లర్ 123 వద్ద ఉన్న రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయింది. అక్కడ పెద్ద గొయ్యి మాదిరిగా ఏర్పడింది. అందులోంచి వర్షం నీరు ఉప్పొంగింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు భారీ వర్షాలకు గుజరాత్లోని వల్సాద్, నవ్సారి జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. వరద ముంపు వల్ల ఈ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాల వల్ల ఆ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 54కు చేరింది. 14,000 మందికి పైగా ప్రజలను తాత్కాలిక షెల్టర్లకు తరలించారు. కాగా, వర్షాల నేపథ్యంలో నాలుగు జాతీయ రహదారులను గుజరాత్ ప్రభుత్వం మూసివేసింది.