న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి సంబంధించిన పలు శాఖలకు బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోతలు పెట్టింది. ఆఖరికి ఆహార, ప్రజాపంపిణీ శాఖకు నిధుల్లో 30 శాతం కోత విధించింది. ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో ఆహార, ప్రజాపంపిణీ శాఖకు కేంద్రం రూ.2,05,513 కోట్లు కేటాయించింది. ఇది 2022-23 వార్షిక బడ్జెట్లో చేసిన రూ.2,96,303 కోట్లతో పోల్చితే 30 శాతం తక్కువ.
ఆహార, ప్రజాపంపిణీ శాఖకు ఇవాళ నిధుల్లో కోతపెట్టిన కేంద్రం అంతకుమునుపే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నిలిపివేసింది. 2020 మార్చిలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడం, అది మరింత ప్రబలకుండా లాక్డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పేదలు తిండికి లేక తిప్పలు పడాల్సి వచ్చింది. దాంతో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పేరుతో ప్రతి రేషన్ కార్డుదారుకు 5 కిలోలు చొప్పున అదనంగా బియ్యాన్ని అందజేసింది. కానీ, 2022 డిసెంబర్ నెలతో కేంద్రం ఆ పథకానికి చరమగీతం పాడింది.